amma-ayya6

ఆలయం-ప్రతిష్ఠ

స్వామి వారు వారణాసి నుంచి మధువర్ణ నర్మదా బాణలింగం గాను , కామాక్షీ అమ్మవారు కంచి నుంచి కామాక్షీ అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉన్న శిల్పాలయం లో మలచబడి ఇక్కడకు వేంచేశారు.
వివిధ అంతరాలయ, పరివార దేవతలు కూడా కంచి నుంచే వేంచేశారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమములు మార్చి 2, 2017 న మొదలై ఐదు రోజుల పాటు పంచాధివాసాలు, రుద్ర హోమము, చండీ హోమము, మూల మంత్ర హోమములు, శ్రీ చక్రార్చన, చండీ సప్తశతి పారాయణం, శ్రీ రుద్ర పారాయణం, ప్రతిష్ఠిత సర్వ దేవతా జపములు మరియూ చతుర్వేద పారాయణములు, గర్తన్యాసం, నవరత్న న్యాసం, నేత్రోన్మీలనం, గోవీక్షణం, కళాన్యాసం, అఖండ మహా పూర్ణాహుతి, శిఖర దివ్య ప్రతిష్ఠలు, శాంతి కళ్యాణం తో స్వస్తిశ్రీ దుర్ముఖి నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ నవమి, సోమవారం మార్చి 06, 2017 ఉదయం 11-05 ని: ప్రతిష్ఠ కార్యక్రమములు సుసంపూర్ణం అయ్యాయి.
శ్రీ కామాక్షీ సమేత ఏకామ్రేశ్వర స్వామి వారి ఆలయం లో అయ్యవారు, అమ్మవారి తో పాటు , శ్రీ చండీశ్వరుడు; అంతరాలయం లో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఉపాలయాలలో శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారలు. స్వామివారి ఆలయ పరివార దేవతలుగా శ్రీ వైష్ణవీ దుర్గ, శ్రీ బ్రహ్మ, శ్రీ మహా విష్ణువు, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ నిధన గణపతి. అమ్మవారి ఆలయ పరివార దేవతలుగా శ్రీ బ్రాహ్మి, శ్రీ మాహేశ్వరి, శ్రీ మహాలక్ష్మి వేంచేసియున్నారు.

స్ఫటికలింగ సమూహము

ఆలయం నైరుతి దిశలో కాశీ నుంచి తీసుకురాబడ్డ స్ఫటికలింగముల సమూహమును ప్రతిష్టించడం జరిగింది ఇవి మొత్తం 52 లింగాలు- త్రిలింగాలు (3), పంచభూతలింగాలు (5), పంచారామలింగాలు (5), ద్వాదశజ్యోతిర్లింగాలు (12), నక్షత్రమండలము (27). ఈ లింగ సమూహాన్ని భక్తులందరూ స్వయంగా అభిషేకం చేసుకునే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ రోజు, ముఖ్యం గా పర్వదినాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో అభిషేకం చేసుకుని ఈ అవకాశమును సద్వినియోగం చేసుకుంటున్నారు

44 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం

44 అడుగుల పొడవుగల ఏకశిలా స్తంభాన్ని హుజూర్ నగర్ నుంచి తెప్పించి ఆలయ ప్రాంగణంలోనే ధ్వజస్తంభం గా మలచబడి స్వామి వారి అనుగ్రహము తో అక్టోబర్ 2017 లో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది

ఆలయ దేవతా వృక్షాలు

ఆలయ ప్రాంగణం లో తూర్పు న ఒకే మామిడి చెట్టు నుండి నాలుగు రకాలు పండ్లు పండేవిధంగా ఆలయ దేవతా వృక్షం పెంచబడుతోంది. ప్రాంగణం లో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, రుద్రాక్ష, మోదుగ, మద్ది, రావి, వేప, ఉసిరిక, శమీ (జమ్మి), తులసి,జిల్లేడు, తుమ్మి, అరటి, చెరుకు, బిల్వ మరియూ వివిధ రకముల మందార మొక్కలు పెంచబడుతున్నాయి

ఆలయంలో జరిగే కార్యక్రమ వివరాలు

ఆలయ సమయాలు: ఉదయం 6: 00 గం - 11:00 గం మరియూ సాయంత్రం 6: 00 గం - 8:00 గం వరకు ఉదయం: శ్రీ ఏకామ్రేశ్వర స్వామి వారికి ప్రతి రోజు లఘున్యాస పూర్వక ఏకవారాభిషేకం.
ప్రతీ సోమవారం, మాసశివరాత్రి , కార్తీకమాసం నెలంతా, మరియూ ఇతర పర్వదినాల్లో మహాన్యాస పూర్వక ఏకవారాభిషేకం/ఏకాదశ రుద్రాభిషేకములు, తదనంతరము నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడుతున్నాయి.
ప్రతీ శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షీ అమ్మవారికి కంచి కామకోటి పీఠంలో జరిగే అభిషేక ప్రక్రియానుసారంగా రుద్ర నమక చమకాలు, శ్రీ సూక్త, దుర్గ సూక్త, మేధా సూక్త పురుష సూక్తముల తో అభిషేకం, తదనంతరము నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడుతున్నాయి.
ప్రతీ శుక్రవారం సాయంత్రం శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారికి తోటకాష్టకం, శ్రీ స్వామి వారికీ శివాష్టోత్తరం అనంతరం శ్రీ కామాక్షీ అమ్మవారికి భక్తులచే సామూహిక లలితా సహస్ర నామ పారాయణం తదనంతరము నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడుతున్నాయి .
ప్రతీ పౌర్ణమి కి, శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతీ సాయంత్రం భక్తులచే లలితా సహస్ర నామపారాయణం తో పాటు సామూహిక కుంకుమార్చన, ప్రత్యేక నక్షత్ర హారతులుజరుపబడుతున్నాయి.

బాల చైతన్య వికాస్

సామాజిక బాధ్యతగా హిందూ ధర్మ రక్షణ పరిరక్షణార్ధం, యువత ఆధ్యాత్మిక అభివృద్ధికి, మానసిక అభివృద్ధి కి ఉపయోగపడే విధంగా వేసవి సెలవుల్లో పిల్లలకు వివిధ శ్లోకాలు - ఆదిత్య హృదయం, భగవద్గీత, విష్ణు సహస్ర నామ స్తోత్రం, ప్రాధమిక పూజ విధానం, వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణ మొదలైన విషయాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమము లో సుమారు 50-60 మంది స్థానిక బాల బాలికలు అత్యుత్సాహంతో పాల్గొంటారు. పిల్లలతో పాటు ముఖ్యంగా తల్లులు (కొంతమంది తండ్రులు) కూడా శిక్షణ సమయం లో పాల్గొని ఇంటికి వెళ్లిన తరువాత తీరిక సమయాల్లో చెప్పిన స్తోత్రాలు/ శ్లోకాలు పిల్లలతో వల్లె వేయిస్తూఉంటారు. వేసవి తరగతుల శిక్షణ అయినా తరువాత పాల్గొన్న వారందరికీ జ్ఞాపికలు, ఉన్నత ప్రతిభ కనబర్చినవారికి ప్రత్యేక నగదు బహుమతులు బహుకరించడం జరుగుతోంది..